
బీజేపీకి పెరిగిన ఆదరణ
● జిల్లా అధ్యక్షుడు గోపీ ఆనంద్
రాయగడ: రాష్ట్రంలో బీజేపీకి ప్రజల నుంచి ఆదరణ పెరిగిందని.. దీంతో ఇతర పార్టీలు తమ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గొపి ఆనంద్ అన్నారు. స్థానిక సిరికోనలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మిశ్రణ పర్వం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. డబల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం భవిష్యత్లో ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా సంక్షేమ పథకాలే రాష్ట్రంలో బీజేపీ విజయానికి దోహదపడ్డాయని అన్నారు. ఆయన హయాంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూడగలుగుతున్నారని చెప్పారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. అనంతరం సమితి పరిధిలోని గుమ్మ పంచాయతీకి చెందిన ఆరుగురు వార్డు సభ్యులు బీజేపీలో చేరారు. అలాగే మరో 50 మంది బీజేడీ, కాంగ్రెస పార్టీల కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి జిల్లా అధ్యక్షులు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు బసంత కుమార్ ఉలక, జిల్లా యువమోర్చ అధ్యక్షులు ఉమేస్ ఖొషల, ఉపాధ్యక్షులు ప్రీతమ్ నాయక్, అశ్విని కొంచాడ, రజత్ మదల పాల్గొన్నారు.