
రథ నిర్మాణ పనులకు కలప కొరత
భువనేశ్వర్: పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. మూడు వేర్వేరు రథాలపై బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు, సుదర్శనుని చతుర్థా మూర్తులు శ్రీ మందిరం నుంచి గుండిచా మందిరానికి తరలివెళ్లడం యాత్ర ప్రాధాన్యత. ఈ సందర్భంగా ఏటా 3 కొత్త రథాలు తయారు చేస్తారు. చక్రాల తయారీ ముగింపు దశకు చేరుకుంటుండగా ఇరుసు, స్తంభాల పనులు చేపట్టారు. ఇలా అంచెలంచెలుగా ముందుకు సాగాల్సిన రథాల తయారీ పనులకు అంతరాయం ఏర్పడింది. అవసరమైన సామగ్రి లేకపోవడం వల్ల పనులు కుంటుపడ్డాయి. ముఖ్యంగా ప్రతి రథం కేంద్ర ఇరుసుకు అవసరమైన 40 అడుగుల ధవురా కలప దూలాలు కొరవడ్డాయి. రథంలో ఇరుసు అత్యంత కీలకమైన దృఢ భాగం. బలమైన ధవురా దూలాలు చాలా ముఖ్యమైన వనరు. దీని కొరతతో అంచెలంచెలుగా కొనసాగించాల్సిన పనులకు గండి పడింది. మరో వైపు సహజ, అసన్ కలప సరఫరా కూడా మందగించింది. మూడు రథాల పైఅంతస్తుల నిర్మాణానికి ఆధారంగా స్తంభాల తయారీలో ఈ కలప అత్యవసరం. మూడు రథాల్లో 27 స్తంభాల తయారీ కోసం ఈ కలప అవసరం. ఈ పరిస్థితిని పర్యవేక్షక వర్గం అంగీకరించింది. కలప కొరతను ఒక ముఖ్యమైన అడ్డంకిగా పేర్కొన్నారు.
కలప సత్వర రవాణా కోసం నయాగఢ్ అట వీ శాఖ అధికారులతో సంప్రదించారు. త్వరలో అవసరమైన కలప అంచెలంచెలుగా చేరుతుందని అటవీ విభాగం అధికార వర్గాలు భరోసా ఇచ్చా యి. రథాలలో కేంద్ర ఇరుసులు ప్రధాన భాగాలు. ఇరుసుల నిర్మాణానికి ధవురా కలప చాలా అవసరం. ఈ కలప చేరాల్సి ఉంది. ఫలితంగా నిర్మాణ పనులు ప్రభావితం అయ్యాయని నందిఘోష రథం ప్రధాన వడ్రంగి సేవకుడు విచారం వ్యక్తం చేశారు. సహజ, అసన్ కలప కొరత కారణంగా రథాల స్తంభం పనులు ప్రభావితం అయ్యాయి. ఈ కీలకమైన నిర్మాణ పనులను చకచకా చేపట్టడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అవసరమైన కలప కొరత కారణంగా పనులు కొనసాగడం లేదని వివరించారు. కలప అంచెలంచెలుగా రవాణా అవుతోంది. ఆదివారం నుంచి క్రమంగా చేరుతుందని శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. రథాల నిర్మాణ పనులు యథాతథంగా వేగవంతం అవుతాయని ఆయన అభయం ఇచ్చారు. గత ఏడాది రథాల తయారీ పనుల తర్వాత 51 కలప దుంగలు మిగిలి ఉన్నాయి. ఈ లెక్కన మరో 814 కలప దుంగలు అవసరం ఉన్నాయి. వాటిలో గత వారం నాటికి 499 కలప దుంగలు కటక్ ఖపురియా కలప మిల్లు, శ్రీక్షేత్రం రథ తయారీ ప్రాంగణానికి చేరినట్లు తెలిపారు. బౌధ్ అటవీ ప్రాంతం నుంచి 40 అడుగుల పొడవైన 32 దూలాలు ఆది వారం చేరాయి. వీటిలో 22 అసన, 10 ధవురా చెక్కలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో వైపు రథాలకు అమర్చే తాత్కాలిక కాటి బాట చారుమళ్ల కోసం తాటి మట్టలు ఢెంకనాల్ నుంచి రానున్నట్లు తెలిపారు.