
బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో చోరీ
రాయగడ: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అందవరపు వాణిశ్రీ ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలను విరగ్గొట్టి అందులొ ఉన్న 70 వేల రూపాయల నగదును దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 21వ తేదీన కౌన్సిలర్ వాణిశ్రీ, ఆమె భర్త ఆనంద్తో సహా కుటుంబ సభ్యులు బద్రీనాథ్ తీర్థ యాత్రలకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని దొంగతనానికి పాల్బడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దుండగులను పట్టుకుంటామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీన స్థానిక రాణిగుడఫారం డీఎఫ్వో కార్యాలయం రెండో లైన్లో కూడా దొంగతనం జరిగింది. పట్టణంలో తరచూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో చోరీ