మల్కన్గిరి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వివిధ వర్గాల పింఛన్లను పెంచుతామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమాంత్ విశ్వశర్మ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంపీవీ–82 గ్రామంలో బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మల్కన్గిరిలో గెలిపించడతోపాటు ఒడిశాలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పాఠశాలలో బెంగాళీ ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. అలాగే దివ్యాంగుల పింఛన్ను 2,100 రూపాయలను 3,100 రూపాయలకు, వృద్ధుల పింఛన్ను రూ. 3,000 చేస్తామన్నారు. సుభద్ర యోజన పథకంలో ప్రతి మహిళకు రూ. 50 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కమలం గుర్తుపై ఓటువేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో మల్కన్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిమయి చంద్రపాల్, నవరంగ్పూర్ ఎంపీ అభ్యర్థి బోలభద్ర మాఝి, మల్కన్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డోంబురు సీసా పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో అసోం
ముఖ్యమంత్రి హేమాంత్ విశ్వశర్మ