
మద్యం మాఫియాను ప్రోత్సహించడం తగదు : అవినాష్
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం మాఫియా పెరిగిపోయిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గుణదల కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం కనుమరుగైందన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు కూటమి నేతలు దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని దయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మద్యం మాఫియాను ప్రోత్సహిస్తోందని, ఈ పద్ధతి తగదన్నారు. కూటమి నాయకులు వీధివీధికి బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అన్ని శాఖలు పారదర్శకంగా పనిచేశాయని గుర్తుచేశారు. మద్యాన్ని అదుపులో ఉంచడంలో గత ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసిందని వివరించారు. కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని దేవినేని అవినాష్ ఖండించారు. ఉగ్రవాదుల చర్య అమానుషమన్నారు. ఈ దాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.