
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
నారాయణపేట రూరల్: జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చర్చిలలో ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణపేట మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలు యేసు నామస్మరణతో మార్మోగాయి. సింగారంలో ఉదయం ప్రభువును స్మరిస్తు పాటలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి కల్వరి కొండకు చేరుకొని అక్కడ ఉదయపుకాల ఆరాధన కార్యక్రమం నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక ఇమ్మెన్యూయేల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రభువు మరణాన్ని జయించి సమాధి నుంచి మృత్యంజయునీగా లేచిన దినాన్నే ఈస్టర్ అని, ఇది ఒక పర్వదినంగా క్రైస్తవులు భక్తిశ్రద్దలతో ఆచరిస్తారని అన్నారు. తనకు తాన తగ్గించుకొన్నవారే హెచ్చించబడుతారని ఏసు బోధించారని అన్నారు. అనంతరం ఏసుక్రీస్తు జీవిత పునరుత్థానంపై సందేశాన్ని వినిపించారు. మహిళలు యేసయ్య పాటలు గీతాలాపన చేశారు. అయా కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవ సంఘ పెద్దలు, చర్చీ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.