అమరచింత: సీసీ కెమెరాలను వినియోగించి నేరాలను ఛేదించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నిఘా నేత్రాల ఏర్పాటుపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందున్నామని డీజీపీ డా. జితేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మస్తీపురం గ్రామంలో ఐజీ రమేశ్రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని.. ఆపద సమయంలో డయల్ 100కు ఫిర్యాదు చేయాలని, దీన్ని మించిన నంబర్ మరోటి లేదని చెప్పారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఐజీ రమేష్రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్టు..
జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటుతో అంతర్రాష్ట్ర అక్రమ రవాణాను నియంత్రించే అవకాశం ఉందని డీఐజీ డా. జితేందర్ అన్నారు. శుక్రవారం రూ.1.50 లక్షలతో నిర్మించే పోలీస్ అవుట్పోస్టు భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రాజెక్టు భద్రతతో పాటు పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని వివరించారు. అనంతరం పోలీస్ అవుట్పోస్టు స్థలంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,మల్టీజోన్ –11 ఐజీపి సత్యనారాయణ, జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్ పాల్గొన్నారు.