
ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
మూసీని ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపుతాం
● గత ప్రభుత్వం గంధమల్లను పట్టించుకోలేదు ● ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. ● తిర్మలాపూర్ సభలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రులతో కలిసి గంధమల్ల రిజర్వాయర్తో పాటు సుమారు రూ.1051.45 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. గంధమల్లకు నీరెక్కడినుంచి ఇస్తారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల తీరును ఆయన దుయ్యబట్టారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి గంధమల్ల జలాశయానికి నీటిని అందిస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తిచేసి తీరుతామన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు, బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామన్నారు. గత సర్కార్ యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను సకాలంలో ప్రారంభించలేకపోయిందన్నారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా..
నా పుట్టిన రోజు సందర్భంగా మూసీ వెంట పాదయాత్ర చేశానని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. మూసీ కాలుష్యం నీటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు గోసపడుతున్నారని, ప్రజల కన్నీటిగోస తీర్చడానికి ఆరునూరైనా మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపి తీరుతానని అన్నారు.
గుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వం యాదగిరిగుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలోభక్తులకు కల్పించని సౌకర్యాలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గుట్టమీద ఎవరూ నిద్రించ వద్దని గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాము అధికారంలోకి రాగానే ఎత్తివేశామన్నారు. గుట్టపైకి ఆటోలను అనుమతించామని గుర్తుచేశారు. మహిళల అభివృఽధ్ధిలో భాగంగా ఇందిరామహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనులను అప్పగించామన్నారు. మహిళలపేరునే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కుంభం అనిల్కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, బండ్రు శోభారాణి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, భువనగిరి డీసీసీ అక్షాంశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సభకు హాజరైన జనం
శంకుస్థాపన చేసిన పనులు ఇవే..
రూ.574.56 కోట్లతో గంధమల్ల
రిజర్వాయర్ నిర్మాణానికి
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా
రెసిడెన్షియల్ స్కూల్కు
రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ
భవన నిర్మాణానికి
రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు
రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి పనులకు
రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో
హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు
రూ.8.25 కోట్లతో మోటకొండూరులో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణం పనులకు
రూ.22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణ పనులకు
రూ.21.14 కోట్లతో ఆలేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు
రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్
కమిటీలో 2500 మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణ పనులకు

ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం

ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం