
మంత్రి కోమటిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు
నల్లగొండ : త్యాగానికి ప్రతీక అయిన ఈద్ ఉల్ అదా (బక్రీద్) సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతిని చాటే బక్రీద్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
భూ సమస్యలను పరిష్కరించుకోవాలి
కేతేపల్లి : రెవెన్యూ సదస్సులో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కేతేపల్లి మండలంలోని భీమవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా భూమికి సర్వే నంబర్లు తప్పుగా ఉండటం, ఆన్లైన్లో భూమి నమోదు కాకపోవడం తదితర భూ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీటీ సత్తార్, పంచాయతీ కార్యదర్శి అనిల్, రెవెన్యూ అధికారులు ఆనంద్, అశ్విని, సంధ్య, విజయ్, బడుగుల నరేందర్యాదవ్ ఉన్నారు.
రైతులకు రుణాల మంజూరు సులభతరం
నల్లగొండ టౌన్ : రైతులకు రుణాల మంజూరు సులభం చేయడం కోసం పాలసీల్లో మార్పులు చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార బ్యాంకు అంటేనే రైతుల బ్యాంక్ అని రైతుల అభివృద్ధికి బ్యాంకు సహాయ పడుతుందని తెలిపారు. రైతులు బ్యాంకులో రుణం పొంది ఏదైనా కారణం చేత మరణిస్తే వారికి ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్) సదుపాయం కల్పించాలని తీర్మాణించినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రాఫ్ వైజ్గా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి, సీఈఓ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
డీఏ ప్రకటన నిరాశ పరిచింది
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన డీఏ పెన్షనర్లను నిరాశ పరిచిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూకల జగదీశ్చంద్ర, పందిరి శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం నుంచి ఐదు విడతల డీఏ పెంపు కోసం పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వ ప్రకటన పెన్షనర్లను ఎంతో నిరాశ పరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం రెండు డీఏలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
9వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిపికేషన్
నల్లగొండ : డీఈఈ సెట్–2025లో ర్యాంకు సాధించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు నల్లగొండలోని డైట్లో సర్టిఫికెట్ వెరిపికేషన్కు హాజరుకావాలని
ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ ప్రిన్సిపాల్ కానుగుల నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించన వారికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరి ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్సీ) కోర్సుల్లో 2025–27 బ్యాచ్ మొదటి సంవత్సరంలో ప్రవేశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

మంత్రి కోమటిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు