
రైతుకు రక్ష.. భూసార పరీక్ష
దేవరకొండ : వ్యవసాయంలో ఎరువుల వాడకంపై అవగాహన లేక దిగుబడులు తగ్గి రైతన్నలు కొన్ని సందర్భాల్లో నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నేల స్వభావాన్ని తెలుసుకొని అందుకు అవసరమైన విధంగా రైతులు పంటలకు ఎరువులు అందిస్తే మేలంటున్నారు వ్యవసాయ అధికారులు. ఈ అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తూ భూసార పరీక్షలు చేపడుతున్నాయి. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ స్కీం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 మండలాలను ఎంపిక చేశారు. ఈ స్కీంలో భాగంగా ప్రతి మండలంలో 125 మంది రైతులను ఎంపిక చేసి వారి పొలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభించారు. రైతులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించి మోతాదుకు మించి రసాయనాలు వాడకుండా చూడనున్నారు. మట్టి నమూనాల సేకరణ అనంతరం జియో ట్యాగింగ్ సైతం చేయనున్నారు. మట్టి పరీక్షల అనంతరం రైతులు పండించే పంటలకు ఎరువులు, రసాయనాల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు.
ఎంపికై న మండలాలు ఇవే..
నల్లగొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి, మునుగోడు, చండూరు, శాలిగౌరారం, అనుముల, నిడమనూరు, తిరుమలగిరి సాగర్, చింతపల్లి, త్రిపురారం, కట్టంగూర్.
అధిక దిగుబడులు సాధించవచ్చు
భూసార పరీక్షలు చేయడం ద్వారా రైతులకు అన్ని విధాల లాభం చేకూరుతుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పంటలకు అవసరమైన పోషకాలు అందించి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. ఎంపిక చేసిన ప్రతి మండలంలో 125 మంది రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి.. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు తగు సూచనలు అందిస్తాం.
– శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ
ఫ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద 15 మండలాలు ఎంపిక
ఫ ఎంపిక చేసిన రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరణ
ఫ సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన
భూసార పరీక్షతో లాభాలు ఇలా..
భూసార పరీక్ష ద్వారా నేల స్వభావాన్ని గుర్తించి అవసరం మేరకు ఎరువులు ఉపయోగించవచ్చు. భూమిలో ఉన్న పోషకాలను తెలుసుకోవచ్చు తద్వారా రైతులు సాగు చేసిన పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది. పంట సాగులో తక్కువ పెట్టుబడులు అవసరం పడుతాయి. సాంకేతిక సాగు ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుతం చేస్తున్న భూసార పరీక్షలతో ఎరువుల వాడకాన్ని అంచనా వేయడంతో పాటు పరీక్షల కోసం వచ్చే రైతులు తన భూమి వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఆయా గ్రామాల్లో ఏఏ రకాల ఎరువులు ఎంత పరిమాణంలో అవసరం అనేది స్పష్టంగా అంచనా వేయవచ్చు. దీని వల్ల ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా పలు లాభాలు చేకూరనున్నాయి.

రైతుకు రక్ష.. భూసార పరీక్ష