నల్లగొండ : రేషన్ బియ్యం పంపిణీ.. గతంలో రెండు, మూడు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యే ప్రక్రియ. ఇప్పుడు మాత్రం ఆలస్యమవుతోంది. మూడు నెలల బియ్యం ఇవ్వాల్సి రావడంతో అన్ని రేషన్ దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది. దీనివల్ల ఇటు డీలర్లకు, అటు లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతోంది. బియ్యం పంపిణీకి వినియోగించే ఈ–పాస్ యంత్రాల అప్డేట్ కావడం, మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ, మారిన సాఫ్ట్వేర్ తదితర కారణాలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఒక్కో కార్డుదారుడికి బియ్యం పంపిణీ చేయాలంటే సుమారు 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద వినియోగదారులు విసుగు చెందుతున్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా కొన్ని దుకాణాల వద్ద డీలర్లు రాత్రి వేళ కూడా బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇన్చార్జి డీలర్లు ఉన్న 65 దుకాణాల్లో రేషన్ ఇచ్చేందుకు ఈ పాస్ యంత్రం ఓపెన్ కావడం లేదు. దీంతో ఆయా దుకాణాల పరిధిలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
యూనిట్కు నెలకు ఆరు కిలోలు
రేషన్ దుకాణాల్లో కార్డుదారుల్లోని ఒక్కో సభ్యుడికి నెలకు 6 కిలోలు చొప్పున బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డు కింద 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ ఇస్తుండటంతో ఎవరూ డబ్బులు చెల్లించడం లేదు. తెల్లరేషన్ కార్డుదారుల్లో ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుంటే వారికి నిర్దేశిత కోటా ప్రకారం ప్రతినెలా 24 కిలోలు బియ్యం వస్తుంది. ఇందులో కేంద్రం వాటా కింద 20 కిలోలు, రాష్ట్ర వాటా 4 కిలోలు బియ్యం ఉంటాయి. (ఒకరికి వచ్చే 6 కిలోల్లో 5 కేజీలు కేంద్రం, మిగతా 1కిలో రాష్ట్ర వాటా). గతంలో ఒక్కసారి వేలిమద్ర వేస్తే 24 కిలోల బియ్యం ఇచ్చేవారు.
ఒకేసారి కేటాయిస్తే..
కేంద్ర, రాష్ట్ర వాటాల కింద వచ్చే బియ్యానికి వేర్వేరుగా వేలిముద్రను తీసుకోవడం వల్ల జాప్యం ఏర్పడుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో డీలర్లు, లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న వాగ్వాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితిలో మార్పు రావాలంటే ఒక కార్డులో ఎంత బియ్యం ఉంటే అంత మొత్తానికి ఒకేసారి వేలిముద్ర వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీలర్లు కోరుతున్నారు. దానికనుగుణంగా సాఫ్ట్వేర్ను మార్పు చేయాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఫలితముంటుందని చెబుతున్నారు.
ఫ సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ఆలస్యం
ఫ ఒక్కో కార్డుదారుడికి 15 నిమిషాలపైగా సమయం
ఫ రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు తప్పని పడిగాపులు
ఫ సాఫ్ట్వేర్ మార్చాలంటున్న రేషన్ డీలర్లు
ఫ ఇన్చార్జులు ఉన్న 65 దుకాణాల్లో ఓపెన్ కాని ‘ఈపాస్’
షాపుల వద్ద ఇబ్బంది పడుతున్నాం
రేషన్ బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. సన్న బియ్యం తీసుకునేందుకు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. ఒక్కోసారి నెట్వర్క్ కూడా పనిచేయడం లేదు. గంటల తరబడి రేషన్ షాప్ వద్ద నిలబడాల్సి వస్తోంది. గతంలో ఇలా లేదు ఒకసారి తంబిస్తే బియ్యం మొత్తం ఇచ్చేవారు.
– శంకరయ్య, లబ్ధిదారుడు, నల్లగొండ
జిల్లాలో రేషన్ వివరాలు ఇలా..
రేషన్ దుకాణాలు 999
రేషన్కార్డులు 4,84,210
యూనిట్లు 15,02,656
మూడు నెలలకు బియ్యం కేటాయింపు 28,718 టన్నులు
కేంద్రం, రాష్ట్రానికి వేర్వేరుగా..
కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చిన నేపథ్యంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కేంద్రం, రాష్ట్ర వాటాకు సంబంధించి వేర్వేరుగా (ప్రతి నెలకు రెండు సార్లు) వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారు ఆరు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. ఒక్కో వ్యక్తి ఇన్నేసి సార్లు వేలిముద్ర వేయడం, మధ్యలో ఎప్పుడైనా సరిగా ముద్ర పడకపోతే మరోమారు ప్రయత్నించాల్సి వస్తోంది. వారి బియ్యం కోటాను తూకం వేసివ్వాలి. ఈ ప్రక్రియంతా పూర్తి కావడానికి సగటున 15 నిమిషాలకు పైగానే సమయం పడుతోంది. ఫలితంగా లబ్ధిదారులంతా వారి వంతు వచ్చేవరకు ఎదురుచూడక తప్పటం లేదు. దీనికి తోడు సర్వర్ బిజీ, నెట్ సిగ్నల్ సక్రమంగా లేకపోవడం, బ్లూటూత్ కనెక్ట్ కాకపోవడం తదితర అంశాలు వేధిస్తున్నాయి. అంత్యోదయ కార్డులు కేంద్ర వాటా కింద రావడంతో వీరు ఒకసారి (మూడు నెలలకు మూడుసార్లు) వేలిముద్ర వేస్తే సరిపోతుంది.
మూడు నెలల బియ్యానికి.. ఆరుసార్లు వేలిముద్ర!