చెరువు మన్ను.. చేనుకు దన్ను | Sakshi
Sakshi News home page

చెరువు మన్ను.. చేనుకు దన్ను

Published Thu, Mar 28 2024 1:40 AM

చెరువు మట్టిని పొలంలో పోసుకున్న రైతు - Sakshi

● చెరువు మట్టిని పొలాల్లో వేయడం ద్వారా పొలాన్ని ఆమ్లా, క్షార గుణాలతో తటస్థంగా మార్చుకోవచ్చు.

● నేల గుల్లబారడంతో పాటు లవణాల గాఢత తగ్గుతుంది.

● సూక్ష్మ, స్థూల పోషకాల స్థాయితో పాటు ముఖ్యంగా నత్రజని స్థాయి పెరుగుతుంది.

● చెరువు మట్టితో పాటు సేంద్రియ ఎరువులను కూడా కలిపి పొలంలో వేసుకోవడం ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.

● చెరువు మట్టిలో సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి నేలలో పోషకాలను పెంచుతాయి.

● కరువు, వర్షాభావ పరిస్థితులను సైతం ఎదుర్కొనే శక్తిని నేలకు అందిస్తుంది.

● మొక్కలు ఆరోగ్యంగా, ఎత్తుగా పెరుగుతాయి.

● పంట దిగుబడి పెరుగుతుంది.

పెద్దవూర: గతంలో వేసవి కాలంలో చెరువుల్లోని నీరు ఎండిపోయినప్పుడు అందులోని మట్టిని తీసి పంట పొలాల్లో వేసుకునేవారు. ఇప్పుడు ఈ పద్ధతి పాటించే వారు తక్కువయ్యారు. కానీ దీని వలన రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయని మండల వ్యవసాయ అధికారి ఎల్‌. సందీప్‌కుమార్‌ సూచిస్తున్నారు. చెరువు మట్టిని పొలాల్లో పోసుకోవడం వలన కలిగే లాభాలు ఆయన మాటల్లోనే.. వర్షాలు పడ్డప్పుడు సారవంతమైన మట్టి మొత్తం వచ్చి చెరువులోకి చేరుతుంది. వేసవిలో నీళ్లు తక్కువగా ఉండటం వలన ఈ మట్టిని పూడిక తీయడం వలన మళ్లీ వచ్చే ఏడాది చెరవులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఇక చెరువు నుంచి తీసిన మట్టిని పంట పొలాల్లో వేయడం ద్వారా ఆ పొలాలు సారవంతం అవుతాయి. చెరువు మట్టి లోతును బట్టి అందులోని పోషకాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇందులో ఆమ్ల, క్షార తత్వాలతో పాటు పురుగు మందుల అవశేషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. చెరువు మట్టి తరలించే ముందు పూడిక స్థాయి, లోతు, విస్తీర్ణం గమనించాలి. చెరువు మట్టిలోని పోషకాల స్థాయిని గుర్తించేందుకు మట్టి పరీక్షలు చేయించాలి. ఇలా కనీసం రెండు మూడేళ్లకోసారి పొలంలో మట్టిని నింపుకోవడం ద్వారా వర్షాల వల్ల నీటి కోతకు గురైన భూములకు చికిత్స జరుగుతుంది. చెరువు మట్టితో పాటు పచ్చిరొట్ట పెంచడం, పశువుల పెంట ఉపయోగించటం వంటివి చేయడం వలన భూమి గుల్లబారుతుంది. నేలకు సరైన మోతాదులో పోషకాలు పెరుగుతాయి.

సాగుకు అనుకూలం..

గ్రామాల్లో వర్షాధార చెరువులు ప్రస్తుతం అడుగంటిపోతున్నాయి. ఎండిన చెరువుల్లోని 2 నుంచి 3 అడుగుల మేర పేరుకుపోయిన మట్టిని పంట భూముల్లో వేసుకోవాలి. తర్వాత ఎంబీ నాగలితో పాటు రోటోవేటర్‌తో కలియదున్నితే భూమిలో అప్పటికే ఉన్న మట్టితో ఇది కలిసిపోయి పంట సాగుకు అనుకూలంగా మారుతుంది. వర్షాలు బాగా కురిసినప్పుడు ఎత్తైన ప్రదేశాల నుంచి వర్షపు నీటితో పాటు ఇసుక, బంకమట్టి, ఒండ్రుమట్టి, వివిధ పాళ్లలో కుళ్లిన వ్యర్థాలతో కలిసి చెరువుల్లోకి చేరుతాయి. అందులో నీరు ఉన్నంతకాలం లోపలే కుళ్లి మంచి సేంద్రీయ కర్బనంగా మారుతుంది. సాధారణంగా చెరువు మట్టిలో 70 శాతం ఒండ్రు, 30 శాతం బంక మట్టి ఉంటుంది. పంటలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పొటాష్‌లతో పాటు సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి.

ఫ అధిక దిగుబడులకు ఆస్కారం

ఎల్‌. సందీప్‌
కుమార్‌, 
ఏఓ, పెద్దవూర
1/2

ఎల్‌. సందీప్‌ కుమార్‌, ఏఓ, పెద్దవూర

2/2

Advertisement
Advertisement