
మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
గోవిందరావుపేట: మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కారల్మార్క్స్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మార్క్సిజం పరిష్కారం చూపుతుందన్నారు. మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడి అతి కొద్ది మంది చేతుల్లో పోగుబడి ఉందన్నారు. మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దూకుడుగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, చిట్టిబాబు, రఘుపతి, వాసు, మల్లారెడ్డి, ఆదిరెడ్డి, గఫూర్, సౌమ్య, చిన్న, దేవయ్య, కృష్ణబాబు, దామోదర్, రాజేష్, చిరంజీవి, చారి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
రవికుమార్