
తాగునీటి కోసం ఆందోళన
ఆవిర్భావ వేడుకలను అడ్డుకున్న గ్రామస్తులు
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని హస్తాల్పూర్లో తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేయడానికి ప్రయత్నించగా, మూకుమ్మడిగా అడ్డుకున్నారు. జెండా గద్దె చుట్టూ ఖాళీ బిందెలు పెట్టి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినా, పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా, తమ గ్రామానికి చుక్క నీరు సరఫరా చేయలేదని ఆరోపించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు జెండా ఎగురవేసేది లేదంటూ భీష్మించుకుకూర్చున్నారు. హల్దీవాగులోని బోరు మోటార్ చెడిపోయి రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడానికి సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు. పోలీసులు నచ్చజెప్పినా స్పందించలేదు. చివరికి కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళన విరమించారు. దీంతో రెండున్నర గంటలు ఆలస్యంగా సుమారు 11 గంటల ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేశారు.