
అలా పొందండి
ఇలా పెంచండి...
● డీఆర్డీఏ ఆధ్వర్యంలో భూగర్భజలాలుపెంపునకు చర్యలు
● సబ్సిడీ పథకాలతో సర్కార్ ప్రోత్సాహం
మెదక్జోన్: భూగర్భజలాలు రోజురోజుకు గణనీయంగా పడిపోతుండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన ఊటకుంటలు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ వంటివాటిని వినియోగించుకుని భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేక పోవటంతో నూటికి 90శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. త్రీ ఫేజు విద్యుత్ ఉన్నంత సేపు వ్యవసాయ పంపు సెట్లు నడుస్తుండటంతో బోరుబావుల్లో నీటి ఊటలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీనికితోడు మండే ఎండలు మరో కారణం. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా వేసవిలో భూగర్భజలాలను పెంపొందించుకునే దిశగా జాబ్కార్డు కలిగిన ప్రతీరైతుకు భూగర్భజలాలను పెంపొందించుకునే అవకాశం కల్పించింది. కాగా, ఈ పథకాలను అతికొద్దిమంది రైతులు మాత్రమే వినియోగించుకుంటుండగా, ఎక్కువశాతం మంది ఆ పథకాలను పట్టించుకోవటం లేదు. ఫలితంగా ప్రతీ ఏటా మార్చి నుంచి జూన్ మాసం వరకు బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి సాగు, తాగు నీటి తిప్పలు తప్పటంలేదు.
ఎండిన బోరు బావుల్లోనూ..
పంటపొలాల్లో కానీ, పట్టణాల్లో ఇళ్ల కోసం తవ్వించిన బోరుబావుల్లో నీరు రాకున్నా, లేక కొన్నేళ్లపాటు నీరు వచ్చి ఉన్న పళంగా వట్టిపోయినా, వేసవిలో మాత్రమే నీరు తగ్గిపోయి వర్షాకాలం, చలికాలంలో మాత్రమే నీరు వచ్చే బోరుబావుల్లో నీటి ఊటలు పెరిగి ఎప్పుడూ నీరు రావాలంటే ఆ బోరుబావిని రీచార్జి స్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది. బోరుబావిలో దింపిన కేసింగ్ చుట్టూ ఒక్కమీటరు లోతు మీటర్ వెడల్పుతో గొయ్యి తవ్వాలి. అనంతరం కేసింగ్కు 12నుంచి 24 చిన్నపాటి రంధ్రాలు కొట్టాలి. ఆ రంధ్రాల చుట్టూ స్టీల్తో తయారు చేసిన సన్నటి జాలీని కట్టాలి. అనంతరం 40 ఎంఎం, 20 ఎంఎం కంకరతో పాటు దొడ్డుపాటి ఇసుకతో గుంతను పూర్తిగా పూడ్చాలి, వర్షాకాలం వరదను ఆ బోరువద్దకు మళ్లించాలి. దీంతో ఆ నీరంతా బోరుబావిలోకి ఇంకి ఏడాది పొడగునా నీరు పుష్కలంగా లభిస్తుంది. విఫలమైన బోరుబావుల నుంచి సైతం తిరిగి నీరు అందిపుచ్చురోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.25వేలు రైతులకు అందజేస్తుంది.
ఇంకుడు గుంతలు...!
పట్టణం, పల్లెటూరు అనేతేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఇందులో వ్యక్తిగత ఇంకుడు గుంతతో పాటు కమ్యూనిటీ పరంగా కూడా నిర్మించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం బోరువేసుకున్న ప్రతీవ్యక్తి దాని పక్కనే ఇంకుడు గుంత తవ్వితే భూమిలోకి నీరు ఇంకి భూగర్భ జలమట్టం పెరుగుతుంది. కాగా, వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మించుకుంటే రూ.6,100 డీఆర్డీఏ ద్వారా లభిస్తుంది. అదే కమ్యూనిటీ పరంగా నిర్మించుకుంటే రూ.14,600 చొప్పున ఇస్తారు.
ఊటకుంటలు
పంటపొలాల్లో రైతులు ఊటకుంటను నిర్మిస్తే దాని పరిమాణాన్ని బట్టి రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు రైతులకు ప్రభ్వుత్వం అందిస్తుంది. దీంతో గణనీయంగా భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభిస్తుంది. అలాగే ఆ కుంటలలో ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఆరుతడి పంటలను పండించవచ్చు ముఖ్యంగా కూరగాయలు సాగుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.