
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
మెదక్ ఎంపీ రఘునందన్రావు
మెదక్జోన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులే గెలవాలని, ఆదిశగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం పట్టణంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఎమ్మెల్సీల గెలుపులో బీజేపీ కార్యకర్తలు, తపస్ నేతల కృషి మరిచి పోలేనిదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపిద్దామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు పట్టణంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, నేతలు ఎంఎల్ఎన్ రెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు.
సీఎం మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు
సీఎం రేవంత్రెడ్డి మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్రావు అన్నారు. తెలంగాణలో బీ జేపీని రానివ్వమని అంటున్నారని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వి జయం సాధించిన విషయం ఆయనకు కనబడటంలేదా అని ప్రశ్నించాడు. దేశంలో కాంగ్రెస్ పని అయిపొయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రభుత్వ స్థలాలు విక్రయించిందన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ల కోసం వేలాది ఎకరాల పేదల భూములు లాక్కున్న చరిత్ర వారిదేనని ఆరోపించారు. ప్రస్తుతం భూములు ఎలా అమ్ముతారని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.