
రైల్వే ట్రాక్పై బీఆర్ఎస్ కార్యకర్తలు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో ఆదివారం నవజీవన్ ఎక్స్ప్రెస్కు అంతరాయం ఏర్పడి నిలిచిపోయింది. కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సి.చటర్జీ సోమవారం విలేకరులకు తెలిపిన కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి చైన్నె వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉప్పల్ రైల్వే స్టేషన్ మీదుగా పోతుండగా గేటు మూసి ఉంది. దీంతో గేట్ వద్ద వాహనాలు ఆగిఉన్నాయి. ఈ సమయంలో ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభకు వెళ్లిన కార్యకర్తలు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో ట్రాక్ దాటుతుండగా గమనించిన నవజీవన్ ఎక్స్ప్రెస్ లోకో పైలెట్ ప్రమాదం జరగకుండా రైలుని నిలిపి వేశారు. దీంతో సాయంత్రం 6:14 నుంచి 6:24 గంటల వరకు రైలుకు అంతరాయం ఏర్పడి నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, పోలీసులతో కలిసి ఉప్పల్ స్టేషన్కు వెళ్లి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఘటనకు బాధ్యులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలు దాటుతూ నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు అంతరాయానికి కారకులుగా ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చటర్జీ పేర్కొన్నారు.
ఉప్పల్లో నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలిపివేత
కేసు నమోదు చేసిన
కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు