
తొలి రోజు డీఎస్సీ ప్రశాంతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీలో భాగంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్లో 1,150 మంది అభ్యర్థులకుగాను 1,008(87.65 శాతం) మంది హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నగరంలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (పీఎస్సీఎంఆర్)లోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే డీఎస్సీ పరీక్షలు రాసేందుకు దాదాపు 30 వేల మందికి ఏర్పాట్లు చేశామని, జిల్లా పరిధిలోని పది పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాకప్ వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ