
దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేమని రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదరణ కల్పించేందుకు కర్నాటకలో వీర రత్న ఫౌండేషన్ను స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీర నారీమణులను చైతన్యవంతులను చేసే అవగాహన కార్యక్రమాన్ని విజయవావడలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు కావాల్సిన వనరులను అందించి, వారి కుటుంబాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు వీర రత్న ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. సైనికుల పిల్లల చదువు, ఆరోగ్యం, ఇతర విషయాల్లో సహాయ, సహాకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈఓ అర్చన చక్రవర్తి, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి