
ఏసీబీకి చిక్కిన డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
చిలకలపూడి(మచిలీపట్నం): డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మంగళవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు కథనం మేరకు.. మచిలీపట్నం నగరానికి చెందిన శ్రీజ టింబరు డిపో యాజమాని వి.రవీంద్రనాథ్ టింబరు డిపో రెవెన్యూవల్ కోసం రెండు నెలల కిందట ఆటవీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించి రెన్యూవల్ చేయాలంటే రూ.25 వేల లంచంగా ఇవ్వాలని ఆటవి శాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.జయప్రకాష్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం రెన్యూవల్కు దర ఖాస్తు చేశానని, రూ.25 వేలు ఇవ్వలేనని రవీంద్ర నాథ్ తేల్చిచెప్పాడు. దీంతో రెన్యూవల్ చేసేందుకు జయప్రకాష్ ససేమీరా అన్నారు. చివరకు రూ.18 వేల లంచం ఇచ్చేలా రవీంద్రనాథ్ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం జయప్రకాష్ తనను లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులను రవీంద్రనాథ్ ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రవీంద్రనాథ్ రూ.18 వేలను నగరంలోని ఆనందపేటలో ఉన్న ఆటవీశాఖ కార్యాలయంలో జయప్రకాష్కు అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసివున్న ఏసీబీ అధికారులు జయ ప్రకాష్ చేతిలో నగదు ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జయప్రకాష్ చేతి వేలిముద్రలు, నగదు నోట్లుపై ఉన్న వేలిముద్రలు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. జయప్రకాష్పై 2017లో ఆటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్న సమయంలో ఏలూరులో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని, ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
టింబరు డిపో రెన్యూవల్ కోసం రూ.18 వేల లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు