కంకిపాడు: కూటమి కోటలు బద్దలు కొట్టి సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ పిలుపునిచ్చారు. మండలంలోని కోమటిగుంటలాకులు, జగన్నాథపురం, క్రిస్టియన్పేట ప్రాంతాల్లో ఆయన బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎంపీపీ పాఠశాల వద్ద గల మరియమాత విగ్రహానికి తొలుత పూలమాల వేసి ప్రార్థనలు చేశారు. అనంతరం కోమటిగుంట లాకులు వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో జోగి రమేష్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు మేలు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతి వనం నిర్మించి జాతికి అంకితమిచ్చారన్నారు. ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా?’ అన్న చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, మోదీ కలిసొచ్చి ప్రజలను మోసం చేసేందుకు కుట్రపన్నారని దుయ్యబట్టారు. వెన్నుపోటు, మోసపూరిత రాజకీయాలకు కళ్లెం వేయాలన్నారు. పెత్తందార్ల కోటను బద్దలు కొట్టి రాక్షస మూకను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి అంతా వైఎస్సార్ సీపీ హయాంలోనే..
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగిందని జోగి రమేష్ అన్నారు. గ్రామాలకు తానే నిధులు సాధించి తెచ్చిపెట్టానని జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కేవలం జగన్ వల్లే ఎన్నికల్లో గెలిచావని గుర్తుపెట్టుకోవాలని, ఏ అభివృద్ధి అయినా అది జగన్తోనే ముడిపడి ఉందని స్పష్టంచేశారు. కొందరు కూటమి నేతలు తాను లోకల్ కాదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకల్ అంటే స్థానికంగా ఉండే వాడు కాదని, అండగా నిలబడేవాడని, పెత్తందార్లు ఎప్పటికీ లోకల్ కాదని తేల్చిచెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానన్నారు. ప్రతి కుటుంబానికి సొంతవాడిగా నిలబడి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నేత చలసాని స్మిత గౌతమ్, జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ మాదు వసంతరావు, జేసీఎస్ చైర్మన్ రాచూరి చిరంజీవి, గుర్విందపల్లి చిట్టిబాబు, సగర కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీనివాసరావు, సీహెచ్సీ చైర్మన్ మేదండ్రావు కుటుంబరావు, అగ్రిబోర్డు చైర్మన్ చాట్ల విజయ్ బాబు, వైస్ ఎంపీపీ కలపాల ప్రకాష్, ఎంపీటీసీ సభ్యులు చిట్టూరి ప్రసాద్, తోకల ఉమాదేవి, కోనా కిషోర్, సర్పంచ్లు జుజ్జవరపు ఎలీషా, పిన్నబోయిన శ్రీనివాసరావు, సిహెచ్ ఆదర్శకుమార్, మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి, నాయకులు దండాబత్తిన సుబ్బారావు, సిరివెళ్ల సాగర్, గోగులమూడి అరుణకుమారి, సిరివెళ్ల రామకృష్ణ, కలపాల వజ్రాలు, బిళ్లా వెంకటేశ్వరరావు, కొండవీటి వెంకట సుబ్బారావు, పిన్నబోయిన పరశురామయ్య, చీలి అనిల్, మహేష్, ప్రసాద్, రాజీవ్, చుండూరు మోహన్రావు, యార్లగడ్డ సుందరయ్య, బిహెచ్ రాజగోపాల్రెడ్డి, అద్దేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
పెత్తందార్ల రాక్షసమూకను తరిమికొట్టాలి వైఎస్సార్ సీపీ పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం