
భూభారతిపై అవగాహన అవసరం
● కలెక్టర్ వెంకటేవ్ దోత్రే
దహెగాం(సిర్పూర్): భూభారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూమి ఎంతో ముఖ్యమని, ఎలాంటి భూసమస్యలు ఉన్నా భూభారతి చట్టం ద్వారా పరిష్కారమవుతాయని అన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యల పరిష్కా రం కోసం ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. రికార్డుల్లో తప్పులు సరిచేయడానికి అవకాశం ఉందని, అప్పీలు వ్యవస్థ కూడా ఎంతో కీలకమన్నారు. భూమార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జతపర్చడం ద్వారా భవిష్యత్తులోనూ భూ వివాదాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
హామీ మేరకు చట్టం తెచ్చాం
ఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్ను తొలగించి నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్తో పేదలకు అన్యాయం జరగగా, సంపన్నులకు మాత్రమే లాభం చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రజ లకు భద్రత కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మండల ప్రత్యేకాధికారి సజీవన్, తహసీల్దార్ కవిత, ఏవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.