
నాణ్యతతో ఇళ్లు నిర్మించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కౌటాల(సిర్పూర్): నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని నాగేపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణ పనుల ఫొటోలను యాప్తోపాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పనులు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రాజీవ్ యువవికాసం కౌంటర్లలో దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల వివరాలు పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో కోట ప్రసాద్, ఎంపీవో మహేందర్రెడ్డి, ఏపీవో పూర్ణిమ తదితరులు ఉన్నారు.