
సేంద్రియ రైతుబజార్ రెడీ...
● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మంలో ఏర్పాటు ● ధ్రువీకరించిన 26మంది రైతులకు అవకాశం ● త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో సేంద్రియ రైతు బజార్(ఆరోగ్య మార్కెట్) ఏర్పాటవుతోంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండించిన ఆహార పంటలు ఆరోగ్యానికి హానీ కలిగిస్తున్నాయనే భావన పెరుగుతుండగా.. ప్రజలు ప్రకృతి సిద్దంగా పండించిన పంటల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వీటిని ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చేలా ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత మార్కెట్ ఆవరణలో సేంద్రియ రైతుబజార్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ షెడ్ను చికెన్, మటన్, చేపల అమ్మకానికి ఏర్పాటుచేసినా సత్ఫలితాలు రాకపోవడంతో సేంద్రియ రైతు బజార్కు కేటాయించారు. జిల్లాలో సేంద్రియ విధానాలతో ఆహార పంటలు, ఉత్పత్తులు చేస్తున్న రైతుల వినతితో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమ్మకాలకు రైతుల గుర్తింపు
సేంద్రియ విధానంలో పంటలు పండించే రైతులతో పాటు ఇతర ఉత్పత్తులు తయారుచేసే వారిని ఇప్పటికే ఉద్యోగులు గుర్తించారు. వ్యవసాయ, ఉద్యాన తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ధ్రువీకరించాక వీరిని అమ్మకాలను అనుమతిస్తారు. సేంద్రియ విధానంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యం, చిరుధాన్యాలు, పండ్లతో పాటు గానుగ నూనెలు, మిరప, పసుపు పొడి, కంది, పెసర, మినుములు, పాలను ఇక్కడ అమ్మనున్నారు. ఈ మేరకు మార్కెట్లో 26 స్టాళ్లు ఏర్పాటుచేసుప్తండగా... కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం పండించే రైతులే కాక గానుగ నూనె, పప్పులు, పాలు, మసాలా పొడులు, జ్యూట్ బ్యాగులు తయారుచేసే 13 మందిని ఎంపిక చేశారు. మరో 13 మంది గుర్తింపునకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.
మొదటిసారి ఖమ్మంలో...
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో తొలిసారిగా సేంద్రియ రైతు బజార్ ఏర్పాటవుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరల విక్రయానికి రైతు బజార్లు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో కూడా రైతు బజార్ల నిర్వహణ ఉంది. అయితే ప్రత్యేకంగా సేంద్రియ విధానంలో పండించే పంటలు, ఉత్పత్తుల కోసం ప్లాస్టిక్ రహితంగా ఈ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేటాయించిన షెడ్కు రంగులు వేసి బోర్డు ఏర్పాటుచేశారు. త్వరలోనే ఈ మార్కెట్ను ప్రారంభించేందుకు జిల్లా అధికారులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
సేంద్రియ ఉత్పత్తిదారులకే అవకాశం
ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న రైతు బజార్లో సేంద్రియ విధానంలో సాగు చేసిన పంటలు, ఇతర ఉత్పత్తుల అమ్మకానికి అనుమతిస్తాం. అలాగే, మసాలా పొడులు, నూనెలు, జూట్ బ్యాగ్లు కూడా అమ్మేలా చూస్తాం. తొలుత ప్రభుత్వ శాఖల
ఆధ్వర్యాన విక్రయదారులను ధ్రువీకరిస్తాం.
– మధుసూదన్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి

సేంద్రియ రైతుబజార్ రెడీ...

సేంద్రియ రైతుబజార్ రెడీ...