తుమకూరు: ఎండిపోయిన చెరువు మధ్యలో కాలిపోయిన ఒక కారు. కారులో రెండు మృతదేహాలు, డిక్కీలో మరో మృతదేహం బూడిదై ఉన్నాయి. ఈ మిస్టరీ సంఘటన తుమకూరు తాలూకాలోని కోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుచ్చంగి చెరువులో జరిగింది. వివరాలు.. కుచ్చంగి చెరువు ఎండిపోయి చెట్లు పెరిగాయి. అందులో శుక్రవారం మధాహ్నం 12 గంటలప్పుడు కాలిపోయిన కారు ఉందని స్థానికులు కోరా పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరిశీలించిగా పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.
దక్షిణ కన్నడ జిల్లా కారు
కారు నంబరును తనిఖీ చేయగా దక్షిణ కన్నడ జిల్లాలో రఫిక్ అనే వ్యక్తి పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇది మారుతి ఎస్ ప్రెస్సో కారు అని, గురువారం అర్ధరాత్రి శిర– కళ్లంబెళ్ల టోల్ ప్లాజాను దాటుకుని వచ్చింది. అప్పటికే హత్య చేసిన మృతదేహాలను కారులో ఉంచి చెరువు మధ్యకు తీసుకొచ్చి నిప్పంటించారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు. లేదా ఘటనాస్థలికి వచ్చాక హత్య చేసి కారులో ఉంచి దగ్ధం చేసి ఉండవచ్చన్నారు. జాతీయ రహదారి చెరువకుు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. మృతులు, హంతకుల జాడ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. జిల్లా ఎస్పీ, ఐజీ రవికాంతేగౌడ తదితరులు కారును పరిశీలించారు.