
మావోలతో శాంతిచర్చలు జరపాలి
పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై సాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేసి వారితో శాంతిచర్చలు జరపాలని ప్రజాసంఘాలు, వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి ప్రజాసంఘాల నేతలు చేస్తున్న వినతులను పెడచెవిన పెడుతూ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ డెడ్లైన్లు విధించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మావోలకు మద్దతుగా ఉంటున్నారంటూ అమాయక ఆదివాసీల ప్రాణాలను బలిగొంటున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముందుకొచ్చి వ్యతిరేకించాలని కోరారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు ముత్యంరావు, సదానందం, అశోక్, జ్యోతి, ప్రశాంత్, కనకరాజు, మల్లయ్య, సూర్య, చంద్రయ్య, మల్లేశ్, లచ్చన్న, భీమన్న, కొమురయ్య, రాజన్న, శ్రావణ్, మానస్కుమార్, లెనిన్, నవీన్, రవికుమార్ పాల్గొన్నారు.