
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని జగదాంబ వైన్స్ వద్ద బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అందె బాలఎల్లయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి భార్య అంజవ్వ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. బాల ఎల్లయ్య దినసరి కూలీగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. బుధవారం సాయంత్రం బయటకు వెళ్లిన బాల ఎల్లయ్య రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వైన్స్ వద్ద అచేతన స్థితిలో పడి ఉన్నాడని తెలుసుకున్న భార్య అంజవ్వ అంబులెన్స్లో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని అంజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో ఆత్మహత్య
మల్యాల: అప్పుల బాధ భరించలేక ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. మల్యాల ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న నాగరాజు (39) రూ.4లక్షల అప్పు కావడంతో, తీర్చే మార్గం కానరాక, బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం రాత్రి మల్యాల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో శవమై తేలాడు. అప్పుల వాళ్లు ఎవరూ బాధ పెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మెట్పల్లి: పట్టణంలోని దుబ్బవాడలో బెజ్జారపు తార ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్ఐ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. తార బుధవారం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. తిరిగి గురువారం రాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా..ఇంట్లో దాచి ఉంచిన తులం బంగారు పుస్తెల తాడు, మూడు గ్రాముల బంగారు విగ్రహాం చోరికి గురైనట్లు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి