
ఇంతకీ ఏ రేటు?
● వాటర్ ట్యాంకర్లలో గందరగోళం ● ప్రైవేట్ ట్యాంకర్కు అమలుకాని రూ.900 రుసుం ● ఇష్టారాజ్యంగా నీటి సరఫరా
కరీంనగర్ కార్పొరేషన్:
కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రైవేట్ ట్యాంకర్లలో ఒక్కోదానికి ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. మున్సిపల్కు చెందిన ట్యాంకర్ల ట్రిప్పుల్లోనూ సరైన లెక్కలు ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. వ్యాపారపరంగా వినియోగించుకుంటున్నందున ప్రైవేట్ ట్యాంకర్లకు ఒక్కోదానికి రూ.900 వసూలు చేయాలనే బల్దియా నిర్ణయం ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు.
ట్యాంకర్ల ద్వారా సరఫరా
వివిధ అవసరాలకు నిర్ణీత రుసుం తీసుకుని ట్యాంకర్లద్వారా నగరపాలకసంస్థ నీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం మున్సిపల్ తరఫున హైలెవెల్, లోలెవెల్ జోన్ పరిధిల్లో సొంతంగా ఆరు ట్యాంకర్లు ఉన్నాయి. ఈ ట్యాంకర్ల ద్వారా నీళ్లు కావాలనుకునే వినియోగదారులు రూ.600 రుసుము నగరపాలకసంస్థ కార్యాలయంలో చెల్లిస్తే కోరిన చోటికి నీటిని సరఫరా చేస్తారు. ప్రైవేట్ ట్యాంకర్లు అయితే కార్యాలయంలో రూ.400 చెల్లించి తీసుకున్న రశీదును రిజర్వాయర్లలో చూపించి నీటిని నింపుకోవాల్సి ఉంటుంది.
అమలు కాని రూ.900
ప్రైవేట్ ట్యాంకర్లు నగరపాలకసంస్థ నుంచి నీటిని కొనుగోలు చేసి, ఇతర అవసరాలకు అధిక ధరకు విక్రయిస్తాయి. ఇందుకోసం గతంలో ఒక్కో ట్యాంకర్కు రూ.200 మాత్రమే చెల్లించే వాళ్లు. ప్రైవేట్ ట్యాంకర్లు చేసేది వ్యాపారం కావడంతో, ఒక్కో ట్యాంకర్ (4 వేల లీటర్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం)కు రూ.900 తీసుకోవాలని గతంలో నగరపాలకసంస్థ సమావేశం తీర్మాణం చేసింది. కాని వివిధ ఒ త్తిళ్ల ఫలితంగా ఇప్పటివరకు అది అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేదు.
ఒక్కో ట్యాంకర్ ఒక్కో రకంగా
ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఒక్కో ట్యాంకర్కు ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. రూ.900 అమలుకు నోచుకోకపోవడంతో, రూ.200 వసూలు చేసిన ట్యాంకర్కు ప్రస్తుతం రూ.400 తీసుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ ట్యాంకర్లకు రూ.200 చొప్పున తీసుకుని రిజర్వాయర్లలో నీళ్లను అందిస్తున్నారు. మరి కొన్నింటికి రూ.400 వసూలు చేస్తున్నారు.
మీటర్లు బిగిస్తేనే
మున్సిపల్ ట్యాంకర్ల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకొంటున్నాయనే ఆరోపణలున్నాయి. రూ.600 చెల్లిస్తే ము న్సిపల్ ట్యాంకర్ను పంపించాల్సి ఉంటుంది. అది కూ డా భవన నిర్మాణాలు లాంటివాటికి వినియోగించరాదు. ఒక ట్యాంకర్ను బుక్ చేసుకుని ఎక్కువ ట్యాంకర్లను తిప్పుతున్నట్లు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు కూడా రశీదు లేకుండానే తిప్పుతున్నట్లు చెబుతున్నారు. ఇది లా ఉంటే మున్సి పల్, ప్రైవేట్ ట్యాంకర్ల అక్రమాలు అరికట్టాలంటే మీ టర్లు, జీపీఎస్ ట్రాకింగ్ను వినియోగించాల్సి ఉంది. రిజర్వాయర్లలో మీటర్లు పెట్టడం ద్వారా ఎన్ని ట్యాంకర్లకు ఎన్ని లీటర్ల నీళ్లు నింపారనే రికార్డు ఉంటుంది. మున్సి పల్ ట్యాంకర్లు ఎక్కడికి వెళుతున్నాయనేది కూడా వెల్లడవుతుంది. దీని ద్వారా అక్రమాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఇంతకీ ఏ రేటు?

ఇంతకీ ఏ రేటు?

ఇంతకీ ఏ రేటు?