కస్తూర్బాలకు ‘ఇంటర్‌’ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

కస్తూర్బాలకు ‘ఇంటర్‌’ వెలుగులు

May 30 2025 1:48 AM | Updated on May 30 2025 1:48 AM

కస్తూర్బాలకు ‘ఇంటర్‌’ వెలుగులు

కస్తూర్బాలకు ‘ఇంటర్‌’ వెలుగులు

కరీంనగర్‌: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పేద, అనాథ బాలికలు చదువుతారు. ఇక్కడ పదో తరగతి వరకు చదివిన బాలికలు కొన్నిచోట్ల ఇంటర్మీడియెట్‌ లేకపోవడంతో విద్యకు దూరమవుతున్నారు. దీనిని గుర్తించిన విద్యాశాఖ 2025–26 సంవత్సరానికి జిల్లాలో మరో రెండుచోట్ల ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. కస్తూర్బాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు ఇంటర్‌మీడియెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వసతి.. నాణ్యమైన విద్య

కస్తూర్బా పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, బోధకులు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తారు. ఈ విద్యాలయాల్లో వసతితో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినులు 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది కేజీబీవీల్లో వందశాతం ఫలితాలు సాధించారు. ఇప్పటికే కస్తూర్బాల్లో ఇంటర్‌ అమలవుతుండగా మరో రెండుచోట్ల అవకాశం కల్పించారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం చిగురుమామిడి, తిమ్మాపూర్‌ కేజీబీవీల్లో రెండు కొత్త కోర్సులైన అకౌంట్స్‌, ట్యాక్సేషన్‌ను ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగనున్నాయి. జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక్కో పాఠశాలకు 80 సీట్లు కేటాయిస్తారు. అనాథ, పేద బాలికలు వీటిలో చదువుకునే అవకాశం కల్పిస్తారు.

కొత్త కోర్సులకు అవకాశం

కస్తూర్బాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌ డబ్ల్యూ కోర్సులు మాత్రమే అమలుచేసేవారు. వచ్చే ఏడాదినుంచి మరిన్ని కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎంఎల్టీ, కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఏఐ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులను కూడా కేజీబీవీల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. రానున్న విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులతో పాటు పాత కోర్సులకు అడ్మిషన్లు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలికలు చదువుతో పాటు ఇతర రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు.

పాఠశాల చదువుకు భిన్నంగా..

కస్తూర్బాల్లో పాఠశాలలకు భిన్నంగా చదువు కొనసాగనుంది. ఇక్కడ చదివేవారికి వసతి సహా మూడు పూటలా పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా ఉచిత దుస్తులు, కాస్మోటిక్‌ కిట్లు, దుప్పట్లు అందజేస్తారు. వేసవిలో కరాటే శిక్షణతో పాటు, ఆంగ్ల భాష నేర్చుకోవడం, బృంద చర్చలు, నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటిపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. బాలికలు సమాజంలో ఎలా ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించవచ్చో, ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దుతారు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

ఇప్పటికే ఎనిమిది కేజీబీవీల్లో

కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ కోర్సులు

మరో రెండు కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు

త్వరలో అడ్మిషన్లు

ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్య అమలవుతోంది. తాజాగా మరో రెండు చిగురుమామిడి, తిమ్మాపూర్‌ కేజీబీవీలను పాఠశాలల్లో ఇంటర్‌ ప్రారంభించేందుకు అనుమతి వచ్చింది. రెండు కొత్త కోర్సులు అకౌంట్స్‌, ట్యాక్సేషన్‌లను ప్రవేశపెట్టింది. వీణవంక, సైదాపూర్‌, కొత్తపల్లి, గన్నేరువరం కేజీబీవీలు మినహా మిగతా వాటిల్లో ఇంటర్మీడియెట్‌కు అనుమతులు లభించాయి. జూన్‌లో తరగతులు ప్రారంభిస్తాం. త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతాం.

–కృపారాణి, సెక్టోరియల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement