
సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డ్రైనేజీల్లో చేపట్టిన సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మంకమ్మతోట టూటౌన్ పోలీసుస్టేషన్ పక్కనున్న నాలాలో సిల్ట్ తొలగింపు పనులను తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల క్రితమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, సిల్ట్ తొలగింపు పనులు ప్రారంభించామన్నారు. వర్షాలు ప్రారంభం కావడానికి ముందగానే సిల్టు తొలగింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. డ్రైనేజీల నుంచి తీసిన సిల్ట్ను దూర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అందరికీ ఆరోగ్య పరీక్షలు
కరీంనగర్టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. మంగళవారం కట్టరాంపూర్ ఆరోగ్యకేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ షుగర్, అధిక రక్తపోటు నిర్ధారణ అయిన వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఉచితంగా మందులు అందించాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మే 28న అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్లు సనజవేరియా, నవ్య, రాజకుమార్ పాల్గొన్నారు.
‘ఇవేం చిల్లర రాజకీయాలు’
మానకొండూర్: రాష్ట్రంలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల క్యాంపు కార్యాలయాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకున్నారా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ప్రశ్నించారు. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టుకున్నారా అని, కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఎందుకు సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టుకోవాలని మండిపడ్డారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఫొటోను కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో పెట్టాలని కాంగ్రెస్ నాయకుల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ స్పందించాలన్నారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ వర్కర్లుగా పనిచేయవద్దని సూచించారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్, నాయకులు ఎరుకల శ్రీనివాస్గౌడ్, రామంచ గోపాల్రెడ్డి, శాతరాజు యాదగిరి, సాయవేని రాజు, గుర్రం కిరణ్గౌడ్, పిండి సందీప్, నెల్లి శంకర్ పాల్గొన్నారు.
కార్మిక సమాఖ్య జిల్లా మహిళా విభాగం
సప్తగిరికాలనీ(కరీంనగర్): తెలంగాణ కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా విభాగాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నేరెళ్ల సౌమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా మోదుపల్లి సౌందర్య, గంగాధర మండల ఇన్చార్జిగా కోలేపాక అంజమ్మ, జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా శనిగరపు కాంతమ్మను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ.. సమాఖ్య కార్మిక సంఘం మహిళా విభాగానికి ఎన్నికవడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా సత్కరించారు.

సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేయాలి

సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేయాలి