
గుర్తుతెలియని వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో భద్రపర్చినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. అతడి ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
యువకుడి బలవన్మరణం
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉన్నత విద్య అభ్యసించినా ఉద్యోగం రావడం లేదనే బెంగతో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గుడికాడి సంపత్(23) అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పొలం దగ్గర ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈసెట్లో మొదటి ర్యాంక్
రామగిరి: తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాల్లో బుధవారంపేట(రామయ్యపల్లి) గ్రామానికి చెందిన కుర్మ అక్షయ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మొత్తం 200 మార్కులకు గాను 124 మార్కులు సాధించింది. మైనింగ్ విభాగంలో మొదటి ర్యాంక్తోపాటు ఓవరల్గా 129వ ర్యాంక్ సాధించింది. పేద కుటుంబంలో జన్మించిన అక్షయ తల్లితండ్రులు లావణ్య, అనిల్కుమార్. లావణ్య వ్యవసాయ కూలి. తండ్రి తాపీమేసీ్త్రగా పని చేస్తున్నాడు. అక్షయ పదోతరగతి రాఘవపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివింది. మైనింగ్ డిప్లోమా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యసించింది.
రేపు అథ్లెటిక్ జట్ల ఎంపిక పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27న కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సబ్ జూనియర్ బాలబాలికల అథ్లెటిక్ జట్ల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి తెలిపారు. అండర్ 8, 10, 12 సంవత్సరాల బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను త్వరలో సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు క్రీడా పాఠశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
సన్న బియ్యం పట్టివేత
మంథని: మంథనిలోని ఓ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో వాహనం నుంచి సబ్సిడీ సన్న బియ్యం దింపుతుండగా.. పౌర సరఫరాల శాఖ, పోలీసులు దాడి చేసి 29క్వింటాళ్ల 20కిలోల బియ్యం పట్టుకున్నారు. అధికారులను చూసి వాహన డ్రైవర్ పారిపోయాడని, బియ్యంతో ఉన్న బండిని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా నల్లవెల్లి సది అనే వ్యక్తి అధికారులపై దుర్భాషలాడి అడ్డుపడినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. అతడితోపాటు వాహన యజమాని ఆరే సంజీవ్, డ్రైవర్ రమేశ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.1.78లక్షలుంటుందన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి