
హత్యకేసు భయంతో వ్యక్తి బలవన్మరణం
పాలకుర్తి(రామగుండం): వివాహిత హత్య ఘటనలో నిందితుడిగా కేసు నమోదైన నేపథ్యంలో ఓ వ్యక్తి భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాలు.. మంథని మండలం లక్కెపూర్ గ్రామానికి చెందిన పండుగ మొగిలి(45) గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా మొగిలి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. ఈక్రమంలో ఈనెల 25న సదరు వివాహిత లక్కేపూర్లో హత్యకు గురైంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు మొగిలిపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు మొగిలి మంచిర్యాలలోని తన అన్నకూతురు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆమెకు తెలిపి పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. సోమవారం పాలకుర్తి మండలం కొత్తపల్లి శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమచారమిచ్చారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.