
‘ఇందిరమ్మ’ నిధులొచ్చాయ్
● జిల్లాలో 85 మంది లబ్ధిదారులకు రూ.85 లక్షలు మంజూరు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలకు మొదటి దశ నగదు చేరింది. కొన్నినెలల క్రితం దరఖాస్తులను స్వీకరించగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. అర్హులను గుర్తించగా మొదటి దశ బేస్మెంట్ లెవల్ పూర్తయిన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. జిల్లాకు రూ.85 లక్షలు రాగా 85మంది లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. కరీంనగర్ అర్బన్ మినహా అన్ని మండలాల్లోని లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు విడుదల చేశారు.
మండలాల వారీగా విడుదలైన నిధులు
కరీంనగర్ రూరల్ మండలానికి రూ.8 లక్షలు, చిగురుమామిడికి రూ.8లక్షలు, చొప్పదండికి రూ.16లక్షలు, ఇల్లందకుంట, కొత్తపల్లికి రూ.లక్షచొప్పున, గంగాధరకు రూ.3 లక్షలు, గన్నేరువరానికి రూ.5లక్షలు, హుజూరాబాద్కు రూ.8లక్షలు, జమ్మికుంటకు రూ.4లక్షలు, మానకొండూరుకు రూ.5లక్షలు, రామడుగుకు రూ.8లక్షలు, శంకరపట్నానికి రూ.6లక్షలు, తిమ్మాపూర్కు రూ.2లక్షలు, సైదాపూర్కు రూ.7లక్షలు, వీణవంక మండలానికి రూ. 3 లక్షలు విడుదలయ్యాయి.
అక్రమాలకు చెక్.. రెండంచెల్లో తనిఖీలు
భౌతికంగా జరిగే నిర్మాణాలకే నిధులు విడుదల కానున్నాయి. అక్రమాలకు ఎలాంటి అస్కారం లేకపోగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జియోట్యాగింగ్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు ఫొటోలను అప్లోడ్ చేస్తుండగా ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తదుపరి అప్రూవ్ చేస్తున్నారు. ఫొటో తీసే క్రమంలో గూగుల్ను మ్యాప్ను అనుసంధానిస్తున్నారు.
400 చదరపు అడుగులు ఉంటేనే బిల్లులు
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తోంది. స్థలంఉండి ఇల్లు కట్టుకోలేని వారు, పూరి గుడిసెల్లో నివాసముంటున్న వారు, పేద వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడు 400 చదరపు అడుగులు దాటకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి నిర్మిస్తే బిల్లులు ఆన్లైన్ చేసే అవకాశం లేదని అధికారులు వివరించారు. ఇప్పటివరకు వైలెట్ ప్రాజెక్టు కింద 15 గ్రామాల్లో పనులు ఊపందుకుంటున్నాయి. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టులో తీసుకున్న 15 గ్రామాలు కాకుండా మరో 290 గ్రామాలతోపాటు నగర, పురపాలికల్లో 146 వార్డులు, డివిజన్లలో ఇళ్లను మంజూరు చేసేందుకు ఇప్పటికే సర్వే చేశారు.
జిల్లా వివరాలు ఇలా
ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన
దరఖాస్తులు: 2,11,467
పరిశీలించిన దరఖాస్తులు: 2,11,191
నివేదిక సమర్పించినవి: 2,10,168
నివేశన స్థలం లేనివారు: 76,927
పైలెట్ ప్రాజెక్టుతో మంజూరు: 2,027
ముగ్గుపోసి పనులు చేపట్టినవి: 702
పునాది దశ పూర్తయినవి: 85
విశేష స్పందన
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారు. జిల్లాలో 85 ఇళ్లకు సంబంధించి బేస్మెంట్ పూర్తవగా రూ.85 లక్షలు మంజూరయ్యాయి. వాటిని లబ్ధిదారుల ఖాతాకు చేర్చడం జరిగింది.
– గంగాధర్, హౌసింగ్ పీడీ, కరీంనగర్

‘ఇందిరమ్మ’ నిధులొచ్చాయ్