
ఉసురు తీసిన అతివేగం
● స్నేహుతుడి వివాహానికి వెళ్తూ
ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
పెరవలి: స్నేహితుడి పెళ్లికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన కత్తుల మహేష్ (19), శీలం అంజిబాబు రైడర్ మోటార్సైకిల్పై వేగంగా వస్తుండగా సడన్ బ్రేక్ వేయటంతో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడి సుమారు 60 మీటర్ల దూరం రోడ్డుపైనే ఈడ్చుకుపోయి డివైడర్ను ఢీకొన్నారు. ఈ సమయంలో మోటార్సైకిల్ నడుపుతున్న కత్తుల మహేష్ రోడ్డు డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే పరుగున వచ్చి ఇద్దరినీ లేపగా మహేష్ ఎటువంటి చలనం లేకపోవటంతో శీలం అంజిబాబును లేపి రోడ్డు పక్కన కూర్చోపెట్టారు. అతడికి తీవ్రగాయాలయ్యాయని, కుడికాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. ఇంతలో జాతీయ రహదారుల అంబులైన్స్ వచ్చి మహేష్కు సపచర్యలు చేయగా శరీరంలో కదలిక రావడంతో వెంటనే ఆక్సిజన్ పెట్టి తణుకు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా మహేష్ మృతిచెందినట్టు తెలిపారు. మహేష్ తండ్రి కత్తుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

ఉసురు తీసిన అతివేగం

ఉసురు తీసిన అతివేగం