
సత్యదేవునికి రూ.1.26 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి గత 28 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,26,07,501 ఆదాయం వచ్చింది. దేవస్థానంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూ.1,19,83,071, చిల్లర నాణాలు రూ.6,24,430 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 50.100 గ్రాములు, వెండి 950 గ్రాములు వచ్చాయన్నారు. హుండీల ద్వారా రోజుకు సగటున రూ.4,50,267 మేర ఆదాయం సమకూరిందన్నారు. హుండీల ద్వారా విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 215, సింగపూర్ డాలర్లు ఏడు, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ ఐదు, యూరోలు 140, బ్రెజిల్ రియల్స్ 22, ఖతార్ రియల్ ఒకటి, కువైట్ రియల్ ఒకటి, ఒమన్ రియల్ ఒకటి, ధాయ్లాండ్ బాట్స్ 140, యూఏఈ దీరామ్స్ 10, మలేషియా రింగిట్స్ 4 లభించాయి. ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో శ్రీవారి సేవ, శ్రీహరి సేవ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది సుమారు 400 మంది పాల్గొన్నారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ సహా ముగ్గురు ఏఈఓలు, ముగ్గురు సూపరింటెండెంట్లు సెలవు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఒక ఉద్యోగి మరణించడంతో కొంతమంది సిబ్బంది అక్కడకు వెళ్లారని పేర్కొన్నారు. దేవస్థానం ఉద్యోగులు చాలా తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. హుండీ లెక్కింపు అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలను తనిఖీ చేసి, వెలుపలకు పంపించారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు.
24,762 మందికి
వేట నిషేధ భృతి
కాకినాడ రూరల్: ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం అమలులోకి వచ్చిన నేపథ్యంలో మత్స్యకారుల ఖాతాల్లో ప్రభుత్వం శనివారం భృతి జమ చేయనుంది. జిల్లాలో 24,762 మంది లబ్ధిదారులకు రూ.20 వేల చొప్పున రూ.49.504 కోట్లు అందించనుంది. కలెక్టరేట్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సముద్రంలో వేట సాగించే 4,451 బోట్లకు మత్స్య శాఖ అధికారులు ఎన్యూమరేషన్ను చేపట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ డేటాను ఆరు అంచెల్లో తనిఖీ చేసి, 24,762 మందిని ఎంపిక చేసి, సోషల్ ఆడిట్ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు అందుబాటులో ఉంచారు. ప్రతి లబ్ధిదారుకూ కేవైసీ చేపడుతున్నామని మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు.