క్రీడలతోనే ఆరోగ్యం పదిలం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతోనే ఆరోగ్యం పదిలం

May 2 2025 12:42 AM | Updated on May 2 2025 12:42 AM

క్రీడలతోనే ఆరోగ్యం పదిలం

క్రీడలతోనే ఆరోగ్యం పదిలం

గద్వాలటౌన్‌: ఆటలు ఆడటం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మినారాయణ అన్నారు. గురువారం స్థానిక మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి వాలీబాల్‌, తాయిక్వాండో కరాటే, ఖోఖో, అథ్లెటిక్స్‌, కబడ్డీ, క్రికెట్‌ క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రీడలతో దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఆరోగ్యకరమైన జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మీతోపాటు మీ ఇంటి దగ్గర ఉండే మీ స్నేహితులను వేసవి శిక్షణ శిబిరానికికి తీసుకురావాలని సూచించారు. ఈ శిబిరం వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడువున నిరంతరం క్రీడలు ఆడేవిధంగా కొనసాగాలని కోరారు. డీవైఎస్‌ఓ అధికారి జితేందర్‌ మాట్లాడుతూ గద్వాలలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సెలవుల్లో క్రీడలు ఆడుతూ ఆనందంగా గడపాలని సూచించారు. ఉదయం, సాయంత్రం సాగే వేసవి శిక్షణా శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన దగ్గర శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులు వినియోగించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా విభాగాల క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌, నగేష్‌బాబు, సతీష్‌, నర్సింహారాజు, కరాటే మాస్టర్‌ శ్రీహరిలతో పాటు ఆయా క్రీడల శిక్షకులు చందు, రవి, తిరుపతి, రజనికాంత్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement