
రాజ్యాంగ హక్కులతోనే స్వేచ్ఛాయుత జీవనం
అలంపూర్ : రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే దేశంలోని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిధున్ తేజ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతోపాటు సంరక్షించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతోనే ప్రతి ఒక్కరు సమాజంలో ఆనందంగా జీవిస్తున్నారని, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, న్యాయవాదులు నారాయణరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగరాజు యాదవ్, తిమ్మారెడ్డి, నరసింహులు, వెంకటేష్, గజేంద్ర గౌడ్, బీమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.