
నిషేధిత కల్లు విక్రయాలను ఉపేక్షించేది లేదు
గద్వాల క్రైం: లైసెన్స్ లేకుండా కల్లు, నిషేధిత పదార్ధాలతో తయారు చేసిన కల్లు విక్రయాలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం కల్లు విక్రేతలతో డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో నిషేధిత కల్లు విక్రయాలపై నార్కోటిక్ డ్రగ్ అధికారులు తనిఖీ చేపట్టిన క్రమంలో కల్తీ కల్లు వెలుగు చూసిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గద్వాల సెగ్మెంట్లలో కల్లు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. లైసెన్స్ పొంది నిషేధిత, అనుమతి లేకుండా కల్లు విక్రయాలు చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కల్లు దుకాణాల వివరాలు, ఈత చెట్ల నుంచి రోజువారీగా ఎన్ని వేల లీటర్లు కల్లు విక్రయాలు చేస్తున్నారు అనే అంశాలపై వారి నుంచి వివరాలు సేకరించామన్నారు. కృతిమ కల్లు పేరిట నిషేధిత కల్లు అమ్మకాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు, ఇందుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, వారికి సిబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నామని, గీతా కార్మికులు, సొసైటీలు, కల్లు డిపోలు, ఈత వనలు తదితర అంశాలపై మాట్లాడారు. అనుమతి లేని దుకాణాలు ఉన్నట్లు గుర్తిస్తే కట్టడి చేసేందుకు పోలీసు శాఖ సైతం చొరవ తీసుకుంటుందన్నారు. కల్తీ కల్లు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచామని, ఇక నుంచి క్రమం తప్పకుండా కల్లు దుకాణాల విక్రయాలు, నిర్వహణ అంశాలపై నిరంతరం తనిఖీలు ఉంటాయన్నారు. మత్తు పదార్థాల సరఫరా, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీఐ శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు.