
కొనుగోళ్లకు కంపెనీల అనాసక్తి
పొగాకు కంపెనీలు అయిన వీఎస్టీ, ఐటీసీ, అలియాన్స్, జీపిఐ, బొమ్మిడాల్, డెక్కన్, నూర్, తదితర కంపెనీలు ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లోనే అధికంగా ఉన్నాయి. బీడి రకం పొగాకు, చుక్కబర్లి, రకాలు త్వరగా కొంటారని ఎంతో ఆశపడి రైతులు సాగు చేశారు. ఒక్కో రైతు 10 ఎకరాలకు పైగా పొగాకును సాగు చేశారు. కానీ తీరా పంట చేతికి వచ్చే సమయంలో బయటి మార్కెట్లో ఏ రకానికి డిమాండ్ ఉంటే అదే కొనుగోలు చేస్తామంటూ కేవలం సిగరేట్ రకాన్ని కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మిగతా రకాలు సాగు చేసిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని కంపెనీలు మీరు ఎంత సాగు చేసినా.. మేం ఇంత మేర మాత్రమే కొంటామని పేర్కొంటున్నాయి. మరికొన్ని ఈ ధర ఇస్తేనే కొనుగోలు చేస్తామని తేల్చి చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడ్డారు.