పేలుళ్లు: బీరూట్‌ గవర్నర్‌ భావోద్వేగం

Beirut Governor Gets Emotional Over Massive Explosion In Lebanon - Sakshi

హిరోషిమా, నాగసాకి ఉదంతాలను గుర్తు చేసింది

బీరూట్‌: తన జీవితకాలంలో ఇంతటి విధ్వంసాన్ని ముందెన్నడూ చూడలేదని బీరూట్‌ గవర్నర్‌ మార్వాన్‌ అబౌడ్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పోర్టు ఏరియాలో పేలుళ్ల ఘటన తనకు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి ఉదంతాలను గుర్తు చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదొక జాతీయ విపత్తు అని ఆవేదన చెందారు. ఈ  ప్రమాదానికి గల అసలు కారణాలేమిటో ఇంకా తెలియరాలేదన్నారు. ఘటనాస్థలిలో తొలుత మంటలు చెలరేగాయని, ఆ తర్వాత పేలుడు సంభవించినట్లు తెలిపారు. మంటలు ఆర్పేందుకు వెళ్లిన దాదాపు 10 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా కనబడకుండా పోయారని, వారి కోసం రక్షణ బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.(‘సర్వనాశనం.. ఇంకేమీ మిగల్లేదు’) 

కాగా లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించిన విషయం విదితమే. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గోదాంలో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. పేలుళ్ల ధాటికి 70 మందికి పైగా మృత్యువాత పడగా.. సుమారు 4 వేల మంది గాయపడ్డారు. ఈ క్రమంలో లెబనీస్‌ ప్రధాని హసన్‌ డియాబ్‌ బుధవారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఇక పేలుళ్లు సంభవించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీరూట్‌లో సాయుధ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని అధ్యక్షుడు మైఖేల్‌ ఔన్‌ ఆదేశించారు. ఇక ఈ బీరూట్‌ ఉదంతంపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పేలుళ్ల ఘటన భయంకరమైన దాడిలా కనిపిస్తోందంటూ సందేహం వ్యక్తం చేశారు.(బీరూట్ బీభత్సం :  మహిళ సాహసం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top