లక్ష్మీపురం: రైళ్లలో గంజాయి, మద్యం అక్రమంగా సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు తీవ్రతరంగా ఉంటాయని రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరాబాబు అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు ఆదేశాల మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సామగ్రిని డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీ చేశారు. ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ గంజాయి, మద్యం అక్రమంగా సరఫరా చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలులో ప్రయాణించే సమయంలో రైల్వే స్టేషన్లలో అనుమానితులు ఉన్నట్లు ఉంటే జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం తెలియజేయాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీలు చేసిన వారిలో జీఆర్పీ ఎస్ఐలు లక్ష్మీనారాయణరెడ్డి, మహిళా ఎస్ఐ దీపికా, జ్యోతి, ఆర్పీఎఫ్ సిబ్బంది శంకరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శివాలయం ఉద్యోగి సస్పెన్షన్
పెదకాకాని: శివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కొన్ని సంవత్సరాలుగా ఇల్లా ప్రదీప్కుమార్ ఎన్ఎంఆర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆలయ అధికారికి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ప్రదీప్ కుమార్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం అతడ్ని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు.
నిత్య అన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హైదరాబాద్వాసి వి.బాలాజి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఇ.ఏడుకొండలు కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
బాలాత్రిపురసుందరికి
బంగారు ఆభరణాలు
కూచిపూడి(మొవ్వ): కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి, పద్మ దంపతులు (హైదరాబాద్–కూచిపూడి) నాట్యాచార్యుల ఇలవేల్పైన శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారికి బంగారు ఆభరణాలను ఆదివారం అందజేశారు. దేవాలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి.. అర్చకులు పెనుమూడి సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన రెండు హారాలను, శ్రీ దాసాంజనేయ స్వామికి రూ. 38 వేల విలువైన 108 వెండి తమలపాకుల మాలను అందజేశారు. ఈ సందర్భంగా హారాలను అమ్మవారికి అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు చేశారు.
గుంటూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు
గుంటూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు