
తాళం వేసిన ఇంట్లో నగలు, నగదు చోరీ
బెల్లంకొండ: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు నగలు, నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని నాగిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై డి.ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరబ్రద్దూరి చిన రమణారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలోని మరి కొంతమందితో కలిసి సోమవారం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో రమణారెడ్డి ఇంట్లోకి దొంగలు కిటికీ గుండా చొరబడ్డారు. బీరువా పగలుకొట్టి 23.5 సవర్ల బంగారం, 15 వేల నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగువారు ఇంటి పరిసర ప్రాంతాల్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని రమణారెడ్డి బంధువులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పెదకూరపాడు సీఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.