
ప్రకృతిలోని జీవరాశులు, పుడమి తల్లిని కాపాడుకోవాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ప్రకృతిలోని జీవరాశులు, పుడమి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రకృతి కవి జయరాజు (తెలంగాణ) అన్నారు. గుంటూరులోని కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగిరెడ్డి సౌజన్యంతో శనివారం ట్రాక్ ఆవరణలో చెట్టు మీద గూడు, చెట్టు కింద నీరు, ఆహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. మూగ జీవులు, పక్షుల సౌకర్యార్ధం గూళ్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. ప్రకృతి కవి జయరాజు మాట్లాడుతూ వేసవిలో తాగునీరు, ఆహారం కోసం పక్షులు ఎంతగానో విలవిలాడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకు దగ్గరలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజీ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటే అది మన అందరిని కాపాడుతుందని అన్నారు. చెట్ల సంరక్షణ కోసం మన వంతుగా చెట్లను పరిరక్షించాలని చెప్పారు. ఏదైనా శుభ కార్యక్రమాల వేళల్లో మొక్కలు నాటాలని తెలిపారు.
కార్యక్రమంలో యోగ గురువులు సభాపతి, ధర్మారెడ్డి, ట్రాక్ కార్యదర్శి శివరామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఇమడాబత్తిని కోటేశ్వరరావు. యేళ్ళ రత్తయ్య, వాకర్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.