కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు

May 1 2025 12:16 AM | Updated on May 1 2025 12:16 AM

కంచి

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరానికి ప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి గల అనుబంధం మరింత ఽబలపడేలా స్థానిక యువ పండితుడు, చతుర్వేది, ఏకసంథాగ్రాహి, దుడ్డు సత్యవేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్‌ తమిళనాడులోని కాంచీపురంలో గల కంచి కామకోటి ఉత్తరాధికారిగా, తదుపరి 71వ పీఠాధిపతిగా అక్షయ తృతీయ పర్వదినాన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సత్యదేవుని నామం కలిపి ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ఇకపై భక్తుల ఆశయాలకు ప్రతీకగా నిలుస్తారని కంచి కామకోటి పీఠాథిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అభిభాషించారు.

శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష

కంచిలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలోని పంచగంగా తీర్థంలో ఉదయం 5–30 నుంచి ఎనిమిది గంటల వరకు జరిగిన వైదిక కార్యక్రమంలో పండితుల మంత్రోచ్ఛాటన మధ్య దుడ్డు గణేష్‌ శర్మ ద్రావిడ్‌ యజ్ఞోపవీతాన్ని విసర్జించారు. తల్లిదండ్రులు దుడ్డు ధన్వంతరి, మంగాదేవి సమక్షంలో వేలాది మంది భక్తులు, పీఠం అభిమానులు చూస్తుండగా సన్యాసి దీక్ష స్వీకరిస్తున్నట్లు బిగ్గరగా మూడుసార్లు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రకటించారు.

శంకరునికి శూలంలా...

విష్ణువుకు చక్రంలా యతికి దండం

శరీరంపై ఉన్న తెల్లని వస్త్రాలను కూడా నీటిలోనే వదిలి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఇచ్చిన కాషాయ వస్త్రాలను ధరించారు. అనంతరం శంకరునికి శూలంలా, విష్ణువుకు చక్రంలా యతి కి దండం ఎల్లప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుందని స్వామీజీ ఉపదేశించి దండాన్ని అందించారు. దండాన్ని చేతబూని ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి’గా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పెద్ద స్వామీజీతో కలిసి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తరువాత కంచి పీఠంలో శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల బృందావనాలను దర్శించారు. తరువాత కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి పీఠంలో శ్రీచంద్రమౌళీశ్వర స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నవరంలో ప్రత్యేక పూజలు

శ్రీదుడ్డు గణేష్‌ శర్మ ద్రావిడ్‌ సన్యాస దీక్ష స్వీకరించిన సందర్భంగా స్థానిక శ్రీసత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్యులుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్రం అధ్యక్షుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర

సరస్వతి స్వామిగా నామకరణం

పులకించిన అన్నవరం

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు1
1/1

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement