● ఇప్పటికే పోలీసులకు,
ఎన్నికల ఆర్వోకు ఫిర్యాదు
● ఎంపీ భరత్రామ్
రాజమహేంద్రవరం సిటీ: 25 శాతం కమీషన్ తీసుకుంటున్నానని నిరాధార ఆరోపణతో కరపత్రాలు పంచి పెట్టిస్తూ, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై జిల్లా కోర్టులో పరూ.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్లు ఎంపీ, వైఎస్సార్ సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాసు చేస్తున్న దురాగతాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే అభివృద్ధి పనుల్లో 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నానని వాసు యూ ట్యూబ్ చానల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వద్ద పదే పదే ఆరోపణలు చేయడంతో పాటు నగరంలో లక్షలాది కర పత్రాలు పంచిపెడుతున్న నేపథ్యంలో పరువు నష్టం దావా వేస్తున్నట్టు వెల్లడించారు. వాసు, టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తన, పార్టీ పరువు తీసేలా ప్రవర్తిస్తుండడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాము చేసిన అభివృద్ధి పనుల్లో లోపాలుంటే విమర్శలు చేయవచ్చు కానీ ప్రత నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. ఒక్క శాతం కమీషన్ తీసుకున్నట్టు నిరూపించినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. నిజానికి ఆ కమీషన్ల సంస్కృతి, ఇతరులను అడ్డంగా దోచుకుతినే అలవాటు ఆదిరెడ్డి కుటుంబానికే ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతో ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ చీకటి ప్రచారానికి వాసు తెర తీశాడని ఎంపీ భరత్రామ్ ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీని, అమిత్ షాను ఇష్టం వచ్చినట్లు అవమానించి, నానా మాటలు అన్న చంద్రబాబుతో బీజేపీ పెద్దలు ఎలా పొత్తు కుదుర్చుకున్నారో ఏపీలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు కడుపు నిండా కుళ్ళు, కుతంత్రాలే అన్నారు. పొత్తు కుదిరాక కూడా మొన్నటికి మొన్న మోదీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబు మాటలు, హామీలు, అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తి అనుభవమే అన్నారు. ఇక ఆయన్ని నమ్మి ఓటు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. చంద్రబాబు హయాంలో హడావుడిగా నిర్మాణం జరుపుకున్న గామన్ బ్రిడ్జి నాణ్యత లోపం కారణంగా కృంగిపోయే దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. గామన్ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్, ఆర్అండ్బి అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరనున్నట్లు తెలిపారు.