
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం
పెరవలి: వ్యాపారం కలసిరాక, అప్పులు తీర్చలేక, అప్పు ఇచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన సంచలనం కలిగించింది. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముత్యాలవారిపాలెం గ్రామానికి చెందిన గంటా తేజనవీన్ తణుకులో గిఫ్ట్ ఆర్టికల్స్ షాపు నిర్వహించేవాడు. వ్యాపార, కుటుంబ అవసరాల కోసం రూ.25 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు బాకీ తీర్చమని ఒత్తిడి చేయసాగారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం కుటుంబం సహా బయటకు వెళ్లిన తేజనవీన్ తిరిగి ఇంటికి చేరలేదు. ఈ మేరకు తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. తేజనవీన్, అతని కుటుంబ సభ్యులు కనిపిస్తే తమకు 94407 96642 లేదా 91548 75611 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు.
బంగారం, నగదుతో
ఉడాయించిన వ్యక్తి అరెస్ట్
రూ.6.53 లక్షల సొత్తు రికవరీ
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గంగుమళ్ల కాసుబాబు వద్ద నుంచి బంగారు నగలు, నగదు తీసుకెళ్లి, పత్తా లేకుండాపోయిన కంతేటి రాజాను సోమవారం అరెస్ట్ చేసినట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయన వివరాల మేరకు, వ్యాపారవేత్త కాసుబాబు వద్ద అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన కంతేటి రాజా ఐదేళ్లుగా క్లర్క్ కం అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. ఆ నమ్మకంతోనే గత నెల 26న కాసుబాబు అతడికి 322 గ్రాముల బంగారు నగలు, రూ.2.25 లక్షల నగదు ఇచ్చి ముమ్మిడివరంలోని ఓ వాణిజ్య బ్యాంక్కు పంపించారు. నగలు, నగదుతో వెళ్లిన రాజా మళ్లీ కనిపించలేదు. దీంతో మరుసటి రోజు కాసుబాబు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు రాజా కోసం గాలిస్తున్నారు. సోమవారం స్థానిక సావరం రోడ్డులో తచ్చాడుతున్న రాజాను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.6.53 లక్షల విలువైన 217 గ్రాముల బంగారు నగలను రికవరీ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు.