
మామిడికి గిట్టుబాటు ధర
– రైతు సంఘాలకు కలెక్టర్ హామీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో తోతాపురి రకం మామిడికి మరో నాలుగు రోజుల్లో గిట్టుబాటు ధర నిర్ణయిస్తామని రైతు సంఘాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హామీ ఇచ్చారు. మామిడి రైతులకు న్యాయం చేయాలంటూ బుధవారం కలెక్టరేట్ వద్ద మామిడి రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం వారు కలెక్టర్కు పలు సమస్యలు వెల్లడించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు మాట్లాడుతూ.. తోతాపురి మామిడికి కిలోకు రూ.30 గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. గుజ్జు యజమానుల నుంచి రూ.20, ప్రభుత్వ ప్రోత్సాహక నిధి నుంచి మరో రూ.10 అందజేయాలని డిమాండ్ చేశారు. రైతుక మామిడి ఉత్పత్తికి రూ.15 ఖర్చు అవుతోందన్నారు. జిల్లాకు మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. బేనీషా రకం మామిడికి రైతు బజారులలో అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలన్నారు. ఆ మామిడికి కిలోకు రూ.50 చొప్పున గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. సంప్రదింపుల కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్, నాయకులు ఆనంద్ నాయుడు, హరిబాబు చౌదరి, మునీశ్వర్ రెడ్డి, భారతి, నాగరాజు నాయుడు, రాజేందర్ రెడ్డి, మస్తానయ్య, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.