
రెక్కలు తెగిన ఈగల్..!
ఈగల్.. పక్షి జాతిలో విభిన్నం.. ఎత్తుకు ఎగిరే కొద్దీ చిన్న జీవినైనా పసిగట్టి..వేటాడే శక్తి ఈ పక్షికి ఉంది. ఆ పక్షిలా పసిగట్టి మాదకద్రవ్యాల నివారణకు ఈగల్ పేరుతో రాష్ట్రంలో టాస్క్ఫోర్సును కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది. అత్యుత్తమ లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఈగల్ రెక్కలు తెగిన పక్షిలా మారింది. ఫలితంగా జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయం, రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ‘ఎలైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్(ఈగల్)’ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మత్తు పదార్థాలను పట్టేస్తామని, నిందితులకు చుక్కలు చూపిస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే.. ఈగల్ చూడ లేక, ఎగర లేక కుక్కినపేనులా పడుంది.
పట్టడానికేనా..?
జిల్లాలో ఇప్పటికే ఈగల్ బృందం ఏర్పాటైంది. దీనికి ఓ ఎస్ఐతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఈగల్ బృందం మాదకద్రవ్యాలపై దాడులు చేయవచ్చు. చిత్తూరు నగరంలో విచ్చలవిడిగా వీధివీధికి గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. పూతలపట్టు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్గా నిలుస్తోంది. గంజాయి బెంగళూరు తరలడానికి పలమనేరును దాటించడంలో నిందితులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈగల్ ఏర్పాటయ్యాక జిల్లాలో పెద్దగా ఎక్కడా నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. సొంతంగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసింది లేదు. పోనీ పాత కేసుల్లో పేరు మోసిన వ్యక్తులపై నిఘా ఉంచారా..? అంటే సమాధానం లేదు. అసలు ఈగల్ బృందంలోని సిబ్బందికి కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, మెలకువలు, నిందితుల డేటా విశ్లేషణ, ఆర్థిక లావాదేవీలపై కనీస పరిజ్ఞానం కూడా లేనట్టు తెలుస్తోంది. ఇటీవల మురకంబట్టులో ఈగల్ బృందం పందెం కోళ్లను పట్టుకోవడమే వీళ్ల పనితీరుకు నిదర్శనం. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బందికి 30 శాతం అలవెన్సు సౌకర్యం కల్పించడంతో, గతంలో సస్పెన్షన్లకు గురైన వాళ్లను కూడా అనుభవజ్ఞులుగా ఈగల్లో పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది.
నిఘా బలోపేతమైతేనే..
జిల్లాకో నార్కోటిక్ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం చిత్తూరులో ఇది ఎక్కడ ఉందో చెప్పనేలేదు. పైగా ఈగల్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న హామీ ఉత్తర ప్రగల్భాల్లా కనిపిస్తోందే తప్ప.. ఇప్పటి వరకు ఏం చర్యలు చేపట్టారన్నది ప్రశ్నార్థకం. ప్రతి కాలనీ, గ్రామస్థాయిలో మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘా ఉంచి, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పౌరులను ఇందులో బాధ్యులుగా చేస్తూ గంజాయి విక్రయాలు, ఉపయోగాలపై రహస్యంగా సమాచారం తెప్పించుకోవడం చేయాలి. పాత కేసుల్లో నిందితుల కదలికలు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..? కొన్ని స్టేషన్ల పరిధిలో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాల కేసుల్లో విశ్లేషణాత్మకమైన దర్యాప్తు..? లాంటి వాటిని అధిగమిస్తేనే ఈగల్కు ప్రాణం వచ్చినట్లవుతుంది. అలా చేయనిపక్షంలో జిల్లా పోలీసుశాఖలో ‘ప్రత్యేక విభాగం’ ఎలాగైతే స్తబ్దుగా ఉందో ‘ఈగల్’ కూడా ఓ మూలన కూర్చోక తప్పదు.
మాదక ద్రవ్యాల కట్టడిపై కూటమి ప్రగల్భాలు
జిల్లా మొత్తానికి ఓ ఎస్ఐ.. ఆరుగురు సిబ్బంది
ఇలాగైతే గంజాయి..మత్తు పదార్థాలను అరికట్టినట్టే
ఈగల్ బృందంలో ఆరోపణలున్న వాళ్లకు చోటు
లక్ష్యం పెద్దది!
మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ‘ఈగల్’ను తీసుకొచ్చింది. గంజాయి స్మగ్లింగ్, మత్తు పదార్థాల వినియోగం, మత్తెక్కించే రసాయనాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడికి ప్రతి జిల్లాలో ఈగల్ పని చేయనున్నట్లు పేర్కొంది. మత్తు పదార్థాలు ఎక్కడైనా ఉపయోగించినా, స్మగ్లింగ్ చేసినా సమాచారం ఇవ్వడానికి ఫోన్–1972 అనే ఉచిత టోల్ ఫ్రీ నంబర్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రస్థాయిలో ఐజీ స్థాయి అధికారిని నియమించిన ప్రభుత్వం.. జిల్లాల్లో ఎస్పీలకే పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది.

రెక్కలు తెగిన ఈగల్..!