
పొట్టకూటి కోసం వెళ్తూ అనంతలోకాలకు..
●ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు ●ఒక మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
దమ్మపేట: పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న ఓ మహిళ మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకుంది. మండలంలోని మందలపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపాన రాష్ట్రీయ రహదారిపై గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను పోలీసుల ఇలా తెలిపారు. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీకి చెందిన నలుగురు మహిళలు, ఒక పురుషుడు మూడు చక్రాల ట్రాలీ ఆటోలో కూలీ పని నిమిత్తం సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు గురువారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని మందలపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే.. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా.. అద్దంకి పద్మ (35) అక్కడికక్కడే మృతి చెందగా.. ముంగి గోపమ్మ, ముంగి మారేశ్వరిలకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. గోపమ్మ, మారేశ్వరిలను ఖమ్మం తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు.

పొట్టకూటి కోసం వెళ్తూ అనంతలోకాలకు..