
రైతుల పాలిట పాషాణ కూటమి
● కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలకు మద్దతు ధర కరువు ● వరి పండినా గిట్టుబాటు ధరకు కొనని కూటమి సర్కారు ● మిర్చి, పొగాకు, శనగ, మినుము, కంది పంటలకూ అదే పరిస్థితి ● లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ● అప్పులు అధికమై బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలు ● పాలకులు స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. కూటమి సర్కారు వచ్చాక అన్నదాతలకు కష్టాలు పెరిగాయి. అప్పులు చేసి పంటలు పండించినా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన పాపాన పోలేదు. కొనే పరిస్థితి లేకుండా పోయింది. బయట మార్కెట్లో ధరలు ఉన్నాయా అంటే అదీ లేదు. దళారులకు తక్కువ ధరకే పంటలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడుల సంగతి దేవుడెరుగు ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు ప్రాణాలు తీసుకుంటున్నా కూటమి పాలకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు.
వరి పంటకూ దక్కని మద్దతు
ఈ ఏడాది జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చిందని అంచనా. ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనలేదు. దీంతో రైతులు బస్తా ధాన్యం రూ. 1300 లోపే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు.
మిర్చి రైతులకూ మిగిలింది కన్నీరే
ఇక నగరం, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల్లో 9,330 ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో క్వింటా మిర్చి రూ. 22 వేల వరకు ధర పలికింది. ఎకరాకు 20 కింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రైతులు లాభాలు చూశారు. ఈ ఏడాది ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్లలోపే దిగుబడులు రాగా రూ. 8 వేల నుంచి 10 వేల లోపు మాత్రమే ధర ఉంది. ఈ ధరతో రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక అప్పులు మిగిలాయి.
పొగాకుకూ అదే దుస్థితి..
జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలలో 64,165 ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. దాదాపు 53 వేల ఎకరాల్లో బ్లాక్ బర్లీ సాగైంది. గత ప్రభుత్వంలో క్వింటా పొగాకు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలికింది. పెట్టుబడి పోను రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం రూ. 5 వేల నుంచి రూ.10 వేల లోపే ధర ఉంది. ఎకరా సాగుకు రూ. 1.60 లక్షల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఉన్న ధరతో కూలీల ఖర్చులు కూడా రావని వాపోతున్నారు. భారీ విస్తీర్ణంలో పొగాకు సాగు చేసిన రైతులు పెట్టుబడులు అధికమై అప్పుల నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొంది. ఇవి కాకుండా రైతులు పండించిన కంది, మినుము, శనగ, పెసర తదితర పంటలకు గిట్టుబాటు ధర లేదు. పేరుకు మార్క్ఫెడ్ ద్వారా కొంటామని ప్రభుత్వం చెబుతున్నా మొక్కుబడిగా కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతుల వరుస ఆత్మహత్యలు
ఊసే లేని పెట్టుబడి సాయం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా సకాలంలో నిరాటంకంగా ఇచ్చారు. ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. గద్దెనెక్కి ఏడాది దాటుతున్నా ఇప్పటికీ రైతులకు ఈ పథకం కింద పైసా ఇవ్వలేదు. గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో 1,92,039 మంది రైతులకు రూ. 13,500 చొప్పున సాయం అందించారు. కూటమి నేతలు చెప్పిన హామీ ప్రకారం రైతుకు రూ. 20 వేల చొప్పున జిల్లాలో ఏటా రూ. 385 కోట్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు పాలనలో రెండో ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా ఇప్పటికీ అన్నదాత సుఖీభవ ఇవ్వక రైతులను వంచించారు.

రైతుల పాలిట పాషాణ కూటమి